న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల్లో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను సాధించిన ఆప్ 126 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 97 వార్డుల్లో విజయం సాధించి రెండో స్ధానానికి పరిమితమైంది. మరికొన్ని వార్డుల కౌంటింగ్ కొనసాగుతుండగా ఇరు పార్టీలు కొన్ని స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి.
ఆప్ విజయంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేనేండ్ల బీజేపీ ఆధిపత్యానికి గండిపడింది. ఎంసీడీ ఎన్నికల్లో విజయంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. కేజ్రీవాల్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు పూలు చల్లుతూ, పరస్పరం స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సాహాల నడుమ సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక ఆప్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు ఆనందంతో నృత్యాలు చేశారు. కాగా ఎంసీడీ ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. నగరం కోసం పనిచేసే వాళ్లను ఢిల్లీ ఓటర్లు అందలం ఎక్కించారని, ఢిల్లీ కోసం పనిచేయని వారిని పక్కనపెట్టారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి దీటైన జవాబు చెప్పారని ఆయన పేర్కొన్నారు.