సంగ్రూర్లో అధికార పార్టీ ఓటమి
3 లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ, జూన్ 26: మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. పంజాబ్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్ ఓడిపోయారు. శిరోమణి అకాలీదళ్(అమృత్సర్) పార్టీ నుంచి పోటీచేసిన సిమ్రన్జిత్ సింగ్ మాన్ 5,822 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పంజాబ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్ రాజీనామాతో సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చాయి. యూపీలోని అజాంగఢ్, రాంపూర్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఈ రెండూ ప్రతిపక్ష సమాజ్వాదీ సిట్టింగ్ స్థానాలు కావడం గమనార్హం. ఇక త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానమైన అగర్తలాలో పరాజయం పాలయ్యింది. త్రిపురలో మొత్తంగా బీజేపీకి మూడు, కాంగ్రెస్కు ఒక స్థానం దక్కాయి. ఢిల్లీ రాజేందర్ నగర్లో ఆప్, జార్ఖండ్లోని మందర్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
ఎవరీ సిమ్రన్జిత్ మాన్?
77 ఏండ్ల సిమ్రన్జిత్ మాన్ శిరోమణి అకాలీదళ్(అమృత్సర్) పార్టీ అధ్యక్షుడు. మాజీ ఐపీఎస్ అధికారి. కరుడగట్టిన సిక్కు వాది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్లార్కు వ్యతిరేకంగా 1984లో సీఐఎస్ఎఫ్ గ్రూప్ కమాండెండ్గా రాజీనామా చేశారు. 1989లో తరన్ తారన్, 1999లో సంగ్రూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆత్మకూరులో వైసీపీ ఘన విజయం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్కుమార్ యాదవ్పై 82,742 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.