న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత (AAP) మనీశ్ సిసోడియాకు (Manish Sisodia) అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిన్న అనుమతించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య సిసోడియాను ఇంటికి తీసుకెళ్లాలని తీహార్ జైలు సూపరింటెండెంట్ను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఆయన ఇంటికి చేరుకోవడానికన్నా ముందే సిసోడియా సతీమణి దవాఖానలో అడ్మిట్ అయ్యారు.
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన సతీమణి ఆరోగ్యం విషమించడంతో కుటుంబీకులు ఆమెను దవాఖానకు తరలించారు. దీంతో ఆయనను జైలు సిబ్బంది హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. కాగా, అవే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 9న అదుపులోకి తీసుకున్నది. దీంతో అప్పటినుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.