AAP | న్యూఢిల్లీ, మార్చి 21: సామాన్యుడి పార్టీగా అవతరించి దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో మూడుసార్లు అధికారంలోకి వచ్చి పట్టు సాధించిన తర్వాత పంజాబ్లో అనూహ్య విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 12.92 శాతం ఓట్లు, ఐదు ఎమ్మెల్యేలను గెలిచి బీజేపీకి సవాల్ విసిరే స్థాయికి చేరింది. గోవాలో గణనీయ ఫలితాలను అందుకున్నది. జాతీయ పార్టీగా గుర్తింపు సాధించి బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ కొరకరాని కొయ్యగా మారిపోయింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢిల్లీలో చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీని బీజేపీ పెద్దలు లక్ష్యంగా చేసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నది. ఆప్ను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగానే కేంద్రంలోని పెద్దలు పావులు కదుపుతున్నారని, ఈ దిశగానే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారనే ఆరోపణ ఉంది.
ముందుగా సత్యేందర్ జైన్ను, ఆ తర్వాత మనీష్ సిసోడియాను, ఇప్పుడు కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. సరిగ్గా లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ద్వారా ఆ పార్టీ శ్రేణులు ఢీలా పడేలా చేయాలనే బీజేపీ వ్యూహం ఉందనే అనే అనుమానాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉంది. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా, హర్యానా, అస్సాంలోనూ పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారనే ప్రచారం దాదాపుగా ఏడాదిగా ఉండగా.. సరిగ్గా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న వేళ అరెస్టు చేయడం వెనుక బీజేపీ రాజకీయ కుట్ర ఉన్నదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాలే కన్వీనర్. ఆయనే స్టార్ క్యాంపెయినర్. ఆయన అరెస్టు పార్టీకి పెద్ద దెబ్బ. కేజ్రీవాల్ అరెస్టుతో ఆయన స్థానంలో ఆయన భార్య సునీత పార్టీ పగ్గాలు అందుకుంటారనే ప్రచారం ఉంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రి ఆతిశీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.