న్యూఢిల్లీ, మే 23: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది. సిసోడియాను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా జూన్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు. అయితే కోర్టుకు హాజరైన సందర్భంగా సిసోడియా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోను ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి ట్విట్టర్లో పోస్టు చేశారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడేందుకు సిసోడియా ప్రయత్నించగా.. ఓ పోలీసు అధికారి జర్నలిస్టులను నెట్టివేస్తూ, సిసోడియాను హడావుడిగా మెడపట్టుకొని లాక్కెళ్లడం ఆ వీడియోలో కనిపించింది. పోలీసుల తీరుపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘సిసోడియా పట్ల ఇలా అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉన్నదా? లేక అలా చేయమని ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. సిసోడియా పట్ల తప్పుగా ప్రవర్తించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని అతిషి డిమాండ్ చేశారు.