న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుబిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ను (Delhi ordinance ) ఆప్ సర్కార్ శుక్రవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుద్ధమని, ఇది ఏకపక్షంగా ఉందని పేర్కొంటూ ఆర్డినెన్స్ను తక్షణమే నిలిపివేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. తన పౌర అధికారులపై ఎన్నికైన ప్రభుత్వం నియంత్రణను ఈ ఆర్డినెన్స్ పక్కదారి పట్టించేలా ఉందని పేర్కొంది. కేంద్రం ఆర్డినెన్స్ ముఖ్యమంత్రిని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తూనే మరోవైపు ఎన్నికైన ప్రభుత్వాన్ని ధిక్కరించేలా ఉందని ఢిల్లీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్దానంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.
నిబంధనల ప్రకారం లెప్టినెంట్ గవర్నర్ మంత్రి మండలి సహాయ సహకారాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం వాదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్ (AAP) తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. జులై 3 నుంచి ఆర్డినెన్స్ ప్రతులను దగ్ఢం చేసేలా దశల వారీ ప్రచార కార్యక్రమానికి ఆప్ పిలుపు ఇచ్చింది.
దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల సర్వీసులపై పట్టు బిగించే ఆర్డినెన్స్ ప్రతులను ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దగ్ధం చేస్తారు. ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కోత విధిస్తూ మే 19న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తమ పోరాటానికి సహకరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విపక్ష నేతలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ దేశ సమాఖ్య వ్యవస్ధకు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆర్డినెన్స్ విషయంలో పలు బీజేపీయేతర పక్షాలు ఆప్నకు మద్దతుగా నిలిచాయి. ఇక ఈ అంశంపై కాంగ్రెస్ ఇంకా తన వైఖరి స్పష్టం చేయలేదు. పట్నా భేటీలోనూ కాంగ్రెస్ మద్దతును ఆప్ కోరగా ఇరు పార్టీలు ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు.
Read More :
High tide waves | ముంబైలో ఎడతెగని వర్షాలు.. అల్లోకల్లోలంగా ఆరేబియా సముద్ర తీరం.. Video