Chandigarh civic polls | చండీగఢ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి ఆమ్ఆద్మీ పార్టీ ఝలక్ ఇచ్చింది. బీజేపీకి చెందిన సిట్టింగ్ మేయర్ స్థానాన్ని ఆమ్ఆద్మీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ ఖంగుతింది. సిట్టింగ్ మేయర్ రవికాంత శర్మను ఆప్ అభ్యర్థి దమన్ ప్రీత్ సింగ్ ఓడించారు. మొత్తం 35 సీట్లుండగా, అందులో 8 వార్డులను ఆప్ కైవసం చేసుకోగా, మరో 2 వార్డుల్లో ముందంజలో ఉంది. ఇక బీజేపీ మొత్తం 5 వార్డుల్లో విజయం సాధించగా, ఒక వార్డులో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ 4 వార్డుల్లో విజయం సాధించింది. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. కౌంటింగ్ కొనసాగుతోంది. చండీగఢ్ మున్సిపాలిటీలో ఆప్ బరిలో నిలవడం ఇదే ప్రథమం. అయినా ముందంజలో ఉండడం విశేషమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ఈ ఫలితాలపై స్పందించారు. ఆమ్ ఆద్మీని చండీగఢ్ ప్రజలు అక్కున చేర్చుకున్నారని, పార్టీకి గ్రాండ్ వెలకమ్ చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. తమకు ఓట్లు వేసిన వారందరికీ పార్టీ తరపున ధన్యవాదాలు ప్రకటిస్తున్నామని సిసోడియా పేర్కొన్నారు.