AAP @ Rajastan | ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి పోటీనిచ్చింది. గణనీయమైన సంఖ్యలో ఓట్లను రాబట్టుకుని ఊపుమీదున్న ఆప్.. త్వరలో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఆప్ జాతీయ కార్యదర్శి సందీప్ పాఠక్కు ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచి గట్టి పోటీ ఉన్నది. ఆప్ కూడా ఇక్కడి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో త్రిముఖ పోటీ అనివార్యం కానున్నది.
గుజరాత్లో మంచి ఓట్లను సాధించి జాతీయ పార్టీగా గుర్తింపు సాధించిన ఆప్.. ఇప్పుడు రాజస్థాన్పై కన్నేసింది. రాజస్థాన్ పెద్ద రాష్ట్రమైనందున ఇక్కడ పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని సీనియర్ నాయకులు అధిష్టానానికి సూచిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలను ఆనుకుని ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చునని వారు చెప్తున్నారు. దాంతో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 30-40 స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ దాదాపు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తున్నది.
గత ఏడాది మార్చి నుంచి రాజస్థాన్లో ఆప్ తన ఎన్నికల కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ 10 నెలల్లో రాజస్థాన్లో ఆప్ ఎదుగుదల గురించి నాయకులు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇదే సమయంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సాధ్యాసాధ్యాలపై ఆ పార్టీ నేతలు మేధోమథనం చేపట్టారు. కార్యకర్తల నుంచి అభిప్రాయం తీసుకున్న అనంతరం ఎన్నికల విధానాన్ని నిర్ణయిస్తామని ఆప్ సీనియర్ నేత వినయ్ మిశ్రా తెలిపారు.