న్యూఢిల్లీ : ప్రధాని మోదీ విద్యార్హతపై ఆప్ మరోసారి విమర్శలు చేసింది. దర్యాప్తు జరిపితే మోదీ డిగ్రీలు నకిలీవని రుజువవుతాయని పేర్కొంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. మోదీ డిగ్రీలు నకిలీవని రుజువైతే ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు.
ఈ సందర్భంగా గుజరాత్ యూనివర్సిటీ జారీ చేసినదిగా చెబుతున్న మోదీ డిగ్రీని చూపుతూ అందులో యూనివర్సిటీ స్పెల్లింగ్ తప్పుగా ఉండటాన్ని ప్రస్తావించారు. దీన్ని బట్టి ప్రధాని డిగ్రీ నకిలీదేనని ఆరోపించారు. అలాగే మోదీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) చేశారని గతంలో మంత్రి అమిత్ షా ఒక సర్టిఫికెట్ను ప్రదర్శించారన్నారు. అయితే ఎంఏ సర్టిఫికెట్లో వాడిన ఫాంట్ 1992లో ప్రవేశపెట్టారని, కానీ మోదీ ఎంఏ చేసినట్టుగా చెబుతున్న సంవత్సరం 1986 అని, అలాంటప్పుడు ఈ ఫాంట్ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు.