లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలాఖరులో లక్నోలో భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యోచిస్తోంది. ఈ ర్యాలీకి పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరు కానున్నారు. ఆప్ నేతలు ఇటీవల యూపీలో చేపట్టిన బిజిలీ యాత్రలకు మంచి స్పందన రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ యాత్రల్లో ఉచిత విద్య, వైద్యం, ఉచిత విద్యుత్ వంటి పార్టీ హామీలపై ఆప్ నేతలు ప్రజలకు వివరించారు. ఆప్నకు యూపీ ప్రజల నుంచి సానుకూల ఫీడ్బ్యాక్ వస్తున్నట్టు అంతర్గత సర్వేల్లో వెల్లడైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే ఊపును కొనసాగించేందుకు పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే మెగా ర్యాలీని విజయవంతం చేసేందుకు శ్రమిస్తామని పేర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక తీర్ధయాత్రల పధకంలో అయోధ్యను కూడా చేర్చడం యూపీలో తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.