న్యూఢిల్లీ, ఆగస్టు 26: బీజేపీ సీరియల్ కిల్లర్ అని, అది వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలను చంపుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అధికార దాహం తీర్చుకొనేందుకు ప్రభుత్వాలను కూల్చివేసే సీరియల్ కిల్లర్ నగరంలో సంచరిస్తున్నాడు’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఇందుకోసం ఆ పార్టీ ఏకంగా రూ. 5,500 కోట్లు వెచ్చించిందని చెప్పారు. తాజాగా ఢిల్లీలో తమ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మరో రూ. 800 కోట్లను కమలదళం పక్కనబెట్టిందని, ఈ లెక్కన మోదీ పరివారం వద్ద రూ. 6,300 కోట్ల నల్లధనం ఉన్నట్టు అర్థమవుతున్నదని మండిపడ్డారు.
పెట్రో ధరల పెంపు, జీఎస్టీ నిధుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎమ్మెల్యేల కొనుగోళ్లకు, తమ మిత్రుల రుణాలను మాఫీ చేసేందుకు బీజేపీ వినియోగిస్తున్నదని అన్నారు. త్వరలో జరుగనున్న గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో ప్రధాని మోదీ తమ పార్టీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపించారు. తమ ఎమ్మెల్యే ఒక్కరు కూడా బీజేపీ వలలో పడలేదన్న ఆయన.. దీన్ని నిరూపించేందుకు సోమవారం విశ్వాస పరీక్ష జరుపనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ‘గుజరాత్లోని బీజేపీ కోటకు బీటలువారాయి.
ఆ కోట ఎప్పుడు కూలుతుందో తెలియదు. అందుకే రానున్న ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయడానికి ఈడీ, సీబీఐతో సోదాలు నిర్వహిస్తున్నది. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో ఇటీవల సోదాలు నిర్వహించిన సీబీఐకి ఒక్క పైసా కూడా దొరకలేదు’ అని కేజ్రీవాల్ అన్నారు. ‘బీజేపీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ సర్కారును కూలదోయాలని యత్నించింది. మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను ఇప్పటికే మోదీ సర్కారు కూలదోసింది. ఇప్పుడు ఢిల్లీ నగరంలో ఆ సీరియల్ కిల్లర్ (బీజేపీ) విహరిస్తున్నది’ అని ధ్వజమెత్తారు.
పెట్రోల్, డీజిల్పై పన్ను, జీఎస్టీ పెంపు ద్వారా వచ్చిన డబ్బుతో ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు మోదీ సర్కారు కుట్రలు చేసిందని ఆరోపించారు. ‘ఢిల్లీలో ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు బీజేపీ రూ. 20 కోట్ల చొప్పున ఆఫర్ చేసింది. మహారాష్ట్రలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్లను ఆశజూపింది. ఇలా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 277 మంది ఎమ్మెల్యేలను కొన్న కమలదళం.. ఇందుకుగానూ రూ. 5,500 కోట్లను ఖర్చు చేసింది. ఆప్ ఎమ్మెల్యేల కోసం రూ. 800 కోట్లను పక్కనబెట్టింది. అంటే మొత్తంగా ఆ పార్టీ దగ్గర రూ. 6,300 కోట్ల నల్లధనం ఉన్నది. ఇంత డబ్బు ఎలా వచ్చింది? జీఎస్టీ నిధులు, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో వచ్చిన డబ్బును బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు వినియోగిస్తున్నది’ అని విరుచుకుపడ్డారు.
అవినీతికి సంబంధించి ప్రధాని మోదీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అవినీతి పోరులో తనకు సాయం అందించాలంటూ మీరు (మోదీ) స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతిజనులను కోరారు. అయితే, సాహెబ్ (మోదీ).. నిజంగా మీరు అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తే, ఎవరి సహకారాన్ని అడగాల్సిన అవసరంలేదు. 2011లో సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కలిసి నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు.. అడగకుండానే వేలాదిమంది మా నిరసనల్లో భాగమయ్యారు.
ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు పట్టించుకోవట్లేదంటే, మీ నాటకాలను వాళ్లు నమ్మట్లేదనే అర్థం’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ సర్కారు నిజంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలనుకుంటే ఐదు కేసుల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుజరాత్ పేపర్ లీక్, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే స్కామ్, కల్తీ మద్యం, అదానీ ఎయిర్పోర్టులో డ్రగ్స్ పట్టివేత, కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినందుకు ప్రతిగా బీజేపీకి అందిన విరాళాలపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.