ముంబై : పలాయనవాదులు, పార్టీకి ద్రోహం చేసిన వారు విజయం సాధించరని మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. శివసేనకు రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మరువలేమని అన్నారు. మరోవైపు జులై 11 వరకూ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రక్రియను నిలిపివేయాలని, యథాతథ స్ధితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రెబెల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని, వారి ఇండ్లు, కార్యాలయాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏక్నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్ధానం ఉద్ధవ్ ఠాక్రే సర్కార్కు నోటీసులు జారీ చేసింది. సుప్రీం తీర్పు బాలాసాహెబ్ అనుసరించిన హిందుత్వ విజయమని ఏక్నాథ్ షిండే అభివర్ణించారు.
ఇక భూ కుంభకోణానికి సంబంధించి రేపు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ జారీ చేసిన సమన్లపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. రేపటి విచారణకు తాను హాజరు కాబోనని ఆయన తేల్చిచెప్పారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపధ్యంలో సంజయ్ రౌత్కు ఈడీ సమన్లు జారీ చేయడం కలకలం రేపింది.