ముంబై : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన రేకెత్తుతోంది. కొత్త స్ట్రెయిన్ ప్రబలుతున్న క్రమంలో నూతన సంవత్సర వేడుకలపై పలు రాష్ట్రాలు నియంత్రణలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ సహా పలు కరోనా మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్లో హాట్స్పాట్గా మారిన ముంబై నగరంలో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతోంది. గత కొద్దిరోజులుగా రోజుకు 150 కేసులు వెలుగుచూడగా ఇప్పుడు రోజుకు 2000 కేసులు నమోదవుతున్నాయని మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు. బుధవారం రోజువారీ కేసుల సంఖ్య 2000 దాటుతుందని ఆయన అంచనా వేశారు. కొవిడ్-19 కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే కరోనా నియంత్రణలను కొనసాగిస్తామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె వెల్లడించారు.
ఇక గోవాలో న్యూ ఇయర్ పార్టీలు, వేడుకల్లో పాల్గొనే అతిధులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా కరోనా నెగెటివ్ రిపోర్ట్ను చూపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కట్టడికి న్యూ ఇయర్ బీచ్ పార్టీలు, వేడుకలను నిషేధించినట్టు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.