Aadhar | ఆధార్ విషయంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయాలు తీసుకున్నది. నవజాత శిశువులకు తాత్కాలిక ఆధార్ కేటాయించనున్నది. అలాగే మరణాలను సైతం నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందు కోసం రెండు పైలెట్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నది. అప్పుడే జన్మించిన శిశులకు తాత్కాలిక ఆధార్ నంబర్ను జారీ చేయనున్నది. ఐదేళ్లు వచ్చాక శాశ్వత ఆధార్ నంబర్ను జారీ చేయనున్నది. మేజర్ అయ్యాక బయోమెట్రిక్ సైతం నమోదు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అలాగే మనిషి పుట్టిన తేదీ దగ్గర నుంచి చనిపోయే తేదీ వరకు వివరాలను సేకరించనున్నారు. దీంతో ఆ వ్యక్తి మొత్తం లైఫ్ సైకిల్ డేటా ఎంత అనేది స్పష్టంగా తెలియడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగుల పింఛన్ ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డెత్ రిజిస్ట్రేషన్ డేటాబేస్తో చనిపోయిన వారి ఆధార్ నంబర్లను లింక్ చేయడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డేటాబేస్లతో లింక్ చేయడం ద్వారా ఇప్పటివరకు ఉన్న లొసుగులను తొలగించడం సాధ్యపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
2010లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఆధార్ను ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు డేటాబేస్గా ఆధార్ నిలిచింది. భారతదేశంలోని దాదాపు మొత్తం వయోజన జనాభా నమోదైంది. అణగారిన వర్గాలను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ఆధార్ను విస్తృతంగా వినియోగిస్తున్నది. గత ఎనిమిదేళ్లలో ఆధార్ వ్యవస్థలోని లీకేజీలను అరికట్టేందుకు.. పేదలు, రైతులు, పలువురి బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బును బదిలీ చేయడానికి సహాయపడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.