Aadhaar | న్యూఢిల్లీ, జనవరి 18: ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగించింది. భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్వో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆధార్ కార్డును ఇకపై ప్రాథమిక గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణిస్తామని, జనన ధ్రువీకరణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదని ఈపీఎఫ్వో పేర్కొన్నది. ఈ మేరకు జనవరి 16 తేదీతో సర్క్యూలర్ విడుదల చేయగా, దీనికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తాజాగా ఆమోదం తెలిపింది. ఇటీవల పలు కేసుల్లో ఆధార్ను జనన ధ్రువీకరణ పత్రంగా లెక్కలోకి తీసుకోలేమని కోర్టులు తీర్పు వెలువరించాయి. ‘పౌరుడి నుంచి తీసుకున్న వివరాలతో ఆధార్ నం బర్ జారీ అవుతున్నది.
ఇది కేవలం విశిష్ట గుర్తింపు సంఖ్య మాత్రమే. పుట్టిన తేదీని ప్రామాణీకరించటం దీంట్లో సాధ్యం కాదని ఆధార్ చట్టం, 2016 చెబుతున్నది. దీనిపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2018లో మెమోరాండం కూడా జారీచేసింది. దాంతో ఆధార్ కార్డు జనన ధ్రువీకరణకు ప్రామాణికం కాదు’ అని ఉడాయ్ తేల్చి చెప్పింది. దీంతో జనన ధ్రువీకరణ పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగిస్తూ ఈపీఎఫ్వో కీలక నిర్ణయం వెలువరించింది.