బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengalore)లో దారుణం జరిగింది. రాత్రి స్నేహితుడితో కలిసి పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారు (Moving car)లో అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తర్వాత రోజు తెల్లవారుజామున ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు సిటీలోని కోరమంగళ (Koramangala) ఏరియాలోగల నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో గత నెల 25న బాధితురాలు తన స్నేహితునితో కలిసి కూర్చుని మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు. రాత్రిపూట పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో భయపడిన ఆమె స్నేహితుడు.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అనంతరం ఆ బెదిరించిన వ్యక్తి తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. వాళ్లు ఆమెను బలవంతంగా పార్కులోంచి ఈడ్చుకెళ్లి ముందుగానే రెడీగా ఉంచిన కారులోకి తోశారు. అనంతరం ఆ కారును వీధుల్లో తిప్పుతూ కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున బాధితురాలిని తన ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు.
పైగా ఘటన గురించి ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెను బెదిరించారు. కానీ, ఆమె పరిస్థితి బాగాలేక పోవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే జరిగిన విషయం కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.