Lok Sabha Elections | న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 8,360 మంది పోటీ చేస్తున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. అధికారిక వివరాల ప్రకారం.. 1996 ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల్లోనే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1996 లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 13,952 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
2019 ఎన్నికల్లో 8,039 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఈ ఎన్నికల్లో 8,360మంది పోటీలో ఉన్నారు. 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో 1,874 మంది మాత్రమే పోటీ చేయగా ఇప్పుడు దాదాపు ఈ సంఖ్య నాలుగింతలకు పైగా పెరిగింది. 1952లో సగటున ఒక్కో నియోజకవర్గానికి 4.67 మంది బరిలో ఉండగా ఇప్పుడు 15.39 మంది పోటీ చేస్తున్నారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో 80 ఏండ్ల పైబడిన వారు 11 మంది పోటీ చేస్తుండగా, 25-30 ఏండ్ల మధ్య వయస్కులు 537 మంది రంగంలో ఉన్నట్టు ఎన్నికల డాటాను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడించింది.
ఇక విద్యాపరమైన అర్హతలు పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు కాగా, 359 మంది ఐదో తరగతి వరకు చదువుకున్నట్టు ఏడీఆర్ తెలిపింది. 647 మంది 8వ తరగతి వరకు చదువగా, 1,303 మంది 12వ తరగతి పాసయ్యారు. అలాగే 1,502 మంది గ్రాడ్యుయేట్లు, 198 మంది డాక్టరేట్లు ఎన్నికల బరిలో ఉన్నారు.