కోల్కతా: పశ్చిమబెంగాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పురాతన భవనాలు బాగా నాని కూలిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కోల్కతాలోనూ ఓ రెండంతస్తుల భవనం కుప్పకూలింది. అహిరిటోలా ఏరియాలో ఈ ఉదయం 6.40 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రెండంతస్తుల ఆ పాత భవనంలో గత కొన్నాళ్లుగా రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
ఈ ఉదయం భవనం కూలిన సమయంలో రెండు కుటుంబాల వారు ఆ భవనంలోనే ఉన్నారు. అయితే భవనంలోని ఒకవైపు భాగం మాత్రమే కూలిపోవడంతో ఒక కుటుంబం వారు క్షేమంగానే బయటపడ్డారు. అయితే మరో కుటుంబం శిథిలాల్లో చిక్కుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద చిక్కుకున్న మూడేండ్ల పసిబిడ్డను, మహిళను శిథిలాల కింది నుంచి వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.