న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ధ్యేయంతో ఏర్పడిన ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టు వ్యవహరిస్తున్నది. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల వరకు ఇదే తీరు. పిల్లీ పిల్లీ కొట్టుకుని కోతికి అప్పగించినట్టు కూటమిలో ఐక్యత లేమి బీజేపీకి వరంలా మారుతున్నది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో 2023లో దేశంలోని 26 విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ కూటమి బీజేపీని దెబ్బతియడం మాత్రం దేవుడెరుగు, అసలు నిలబడగలదా? అని చాలా మంది సందేహపడ్డారు. అయితే ఈ కూటమి తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా అధికార బీజేపీని మాత్రం దెబ్బతీసిందని చెప్పవచ్చు.
2024 లోక్సభ ఎన్నికల్లో మునుపటి కన్నా సీట్లు తగ్గి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థాయికి బీజేపీ చేరుకుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో కూటమి పార్టీలు చూపిన ఐక్యత రాష్ర్టాల విషయానికొచ్చే సరికి పలచబడింది. రాష్ట్రంలో ఎవరి ప్రయోజనాలు వారికి ఉండటంతో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడింది. రానురాను కేంద్రంలో దోస్తీ, రాష్ట్రంలో కుస్తీ తరహాలో ఇండియా కూటమి రాజకీయాలు మారాయి. దేశ వ్యాప్తంగా బలహీన పడిన జాతీయ పార్టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పేరుతో బలం పుంజుకోవాలని ప్రయత్నించినా ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ, ఇతర పార్టీలు దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలూ కూటమికి బీటలు వారుస్తున్నాయి.
ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సంగతి తీసుకుంటే కూటమిలో భాగస్వాములైనప్పటికీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, కాంగ్రెస్ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి ఎలాంటి పొత్తు లేదు. బెంగాల్లో కాంగ్రెస్కు ఏమాత్రం పట్టులేదని, అలాంటి పార్టీ కోసం తమ బలాన్ని ఎందుకు ఉపయోగిస్తామని మమత ప్రశ్నిస్తూ, ఈ ఎన్నికల్లో తాము సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో టీఎంసీ, కాంగ్రెస్-వామపక్ష, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు ఏర్పడింది. అయితే అది అంత సుహృద్భావ వాతావరణంలో జరుగ లేదు. దీర్ఘకాలం పాటు జరిగిన చర్చల్లో కాంగ్రెస్ 40 సీట్లు, అధికారంలో భాగస్వామాన్ని కోరగా, దానిని డీఎంకే తిరస్కరిస్తూ 28 అసెంబ్లీ, ఒక రాజ్యసభ సీటుకు ఒప్పందం కుదుర్చుకుంది. తమ కూటమి పార్టీ అయినప్పటికీ అధికారంలో భాగస్వామిని చేయడానికి సీఎం ఎంకే స్టాలిన్ నిర్దంద్వంగా తిరస్కరించారు.
ఎన్నికలు జరుగుతున్న కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), సీపీఐ (ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ముఖాముఖీ తలపడుతున్నాయి. అయితే ఈ రెండు కూటములు కూడా ఇండియా కూటమిలో భాగస్వాములైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం బద్ధవిరోధులే. అధికార ఎల్డీఎఫ్ అవినీతి, ప్రజావ్యతిరేకతపై కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా, బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని అధికారం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నదని విజయన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది.
ఇండియా కూటమి ప్రయాణాన్ని చూస్తే జాతీయ స్థాయిలో అది బీజేపీ వ్యతిరేక వేదికగా చక్కగా పనిచేసింది. అయితే రాష్ట్ర స్థాయిలో ఆ ఐక్యతను కొనసాగించడంలో విఫలమైంది. రాష్ట్ర స్థాయిలో పార్టీల స్వప్రయోజనాలే ముఖ్యం కావడంతో ఆ ఫార్ములా పనిచేయలేదు. లోక్సభలో బీజేపీయే తమ ప్రధాన శత్రువుగా కూటమి పార్టీలు భావించి పోరాడగా, రాష్ట్రంలో మాత్రం తమలో తామే పోటీకి దిగి బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తున్నాయి.
మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) మంచి ఫలితం సాధించగా, అదే ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది.