హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఏపీలోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉన్న ఒక రైలును మరో రైలు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మరణించగా, దాదాపు 20 మందికి గాయాలయ్యాయి.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. క్షతగాత్రులను అంబులెన్స్లలో దవాఖానకి తరలించారు. విశాఖపట్నం నుంచి బయలుదేరిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఓవర్ హెడ్ విద్యుత్తు వైర్లు తెగిపోవడంతో పట్టాలపై ఆగిపోయింది. ఆగి ఉన్న ఈ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్ప్రెస్ ఢీకొన్నది. దీంతో రాయగడ ప్యాసింజర్ రైలు చివరి మూడు భోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొన్నది.
సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విద్యుత్తు వైర్లు తెగిపోవడంతో ఘటనా ప్రాంతం అంధకారంగా మారింది. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.