మంగళూరు, జనవరి 31: బీజేపీ పాలిత కర్ణాటకలో సమ్మె సైరన్ మోగింది. సీఎం బొమ్మై ప్రభుత్వ తీరుకు నిరసనగా స్థానిక సంస్థలకు చెందిన ఔట్సోర్సింగ్ కార్మికులందరూ బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. మున్సిపల్ కార్మికుల తరహాలో దశలవారీగా తమను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చెత్త రవాణా వాహనాల డ్రైవర్లు, నీటి సరఫరా హెల్పర్లు, లోడర్స్, క్లీనర్స్, పారిశుద్ధ్య కార్మికులతో సహా రాష్ట్రంలోని 330 స్థానిక సంస్థల ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళనల్లో పాల్గొంటారని ఔట్సోర్సింగ్ కార్మిక సంఘం నేత బీకే అన్నప్ప ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 15 వేల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నిలువునా అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఆందోళనలో భాగంగా కార్మికులు నీటి సరఫరా ఆపేస్తామని, పారిశుద్ధ్య పనులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.