(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. గత నెల 24న అహ్మదాబాద్ ఎన్నికల ప్రచార సభలో తన వల్లే గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పడానికి ప్రజలను తప్పుదోవ పట్టించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అంటే 2002 సమయంలో అహ్మదాబాద్లో కేవలం ఒకే ఒక యూనివర్సిటీ ఉండేదని, కాని ప్రస్తుతం జిల్లాలో 23 యూనివర్సిటీలున్నాయని, అది తన ఘన కీర్తే అని చెప్పారు. బీజేపీ అధికార ట్విట్టర్ ఖాతా కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కానీ ప్రముఖ న్యూస్ వెబ్సైట్ ‘స్క్రోల్’ ప్రధాని మోదీ మాటల్లో నిజం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 2002 నాటికి అహ్మదాబాద్లో మూడు యూనివర్సిటీలున్నాయని ఫ్యాక్ట్ చెక్లో తేల్చింది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే స్వాతంత్రం రాకముందే 1920 నవంబరులోనే గుజరాత్ విద్యాపీఠ్ అనే సంస్ధను మహత్మా గాంధీ స్థాపించారని పేర్కొంది. అలాగే 1949లో గుజరాత్ యూనివర్సిటీ, 1994లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్ధాపించారని పేర్కొంది.