బెంగళూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారులో తనతోపాటు ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం కారులో సంభవించిన బాంబు పేలుడు ధాటికి అతడు సజీవ దహనమయ్యాడు. మరణించిన వ్యక్తిని నాగేంద్ర(30)గా పోలీసులు గుర్తించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు గల కారణాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. నిందితుడు నాగేంద్ర వద్ద ఉన్న బాంబు అకస్మాత్తుగా పేలడంతో కారులో మంటలు చెలరేగాయని కారు డ్రైవర్ ప్రవీణ్ పోలీసులకు చెప్పాడు.
ఈ ఘటనలో కారులోని రమ్య ఉల్లాస్కు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన రమ్య బెంగళూరులోని సంజయ్గాంధీ దవాఖానలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్గా పనిచేస్తున్నది. నాగేంద్ర బెంగళూరులో కారును బుక్ చేసుకొని రమ్యతో కలిసి అందులో ప్రయాణిస్తుండగా తుమకూరు సమీపంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. తర్వాత ఆమె కారు నుంచి బయటకు దూకింది. డ్రైవర్ కారు దిగాక బాంబు పేలింది.