CM Basavaraj Bommai | బెంగళూరు, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓలేకర్కు పార్టీ టికెట్ లభించలేదు. దీంతో గురువారం తన మద్దతుదారులతో కలసి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సీఎం బొమ్మై అవినీతి బాగోతాన్ని త్వరలోనే బయటపెడతానని తెలిపారు. బొమ్మై వల్లే తనకు టికెట్ రాలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ టికెట్ తప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని విమర్శించారు. మొత్తం జిల్లాపై పెత్తనాన్ని సాధించేందుకు కుట్ర పన్ని పోటీకి నిలబడకుండాచేశారని మండిపడ్డారు. అటు.. టికెట్ దక్కకపోవటంతో సీనియర్లు బీజేపీని వీడుతున్నారు. దొడ్డప్పగౌడ పాటిల్, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి ఎస్ అంగారా కూడా బీజేపీని వీడటానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే కుమారస్వామి పార్టీకి గుడ్బై చెప్పారు. మాజీ మంత్రి శివణ్ణ జేడీఎస్లో చేరుతున్నానని తెలిపారు. ఎమ్మెల్సీ ఆర్ శంకర్ పార్టీ సభ్యత్వం, పదవులను త్యజించారు. హొసదుర్గ స్థానంలో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతానని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గూళిహట్టి శేఖర్ ప్రకటించారు.
సంఘవిద్రోహక శక్తులను పార్టీలో చేర్చుకున్న పర్యవసానాన్ని బీజేపీ అనుభవిస్తున్నది. సైలెంట్ సునీల్ అనే రౌడీషీటర్ ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. చామరాజపేట నుంచి పోటీకి సన్నాహాలు చేసుకున్నాడు. అక్కడ నగర మాజీ పోలీసు కమిషనర్ భాసరరావుకు టికెట్ దకింది. దీంతో ఆగ్రహించిన సైలెంట్ సునీల్ తన అనుచరులతో కలసి బీజేపీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
హిజాబ్ వివాదాన్ని ముందుండి నడిపిన వారికి బీజేపీ టికెట్లు ఇస్తున్నది. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థులను కాలేజీలకు రాకుండా యశ్పాల్ సువర్ణా అడ్డుకున్నాడు. దీంతో ఉడిపి స్థానంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రఘుపతి భట్ను కాదని, యశ్పాల్ సువర్ణాకు ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చింది.
హంగ్ వస్తే జేడీ(ఎస్)కీలక పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తమ పార్టీలో అనేక మంది నేతలు చేరబోతున్నారని ఆ పార్టీ నేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. ఉత్తర కర్ణాటకలో 30 – 40 స్థానాలు గెలుస్తామన్నారు. జేడీఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్లిన 15 మంది తిరిగి జేడీఎస్ వైపు రాబోతున్నారని కుమారస్వామి చేసిన ప్రకటన కాంగ్రెస్లో ప్రకంపనలు రేపింది.