స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచిస్తూ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ‘క్యాన్సర్ ఇమ్యునోథెరపీ 2.0’ పేరిట కొత్త చికిత్సా విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకూ ఉన్న విధానాల్లో వ్యాధిని నయంచేసే సమయంలో క్యాన్సర్ కణాలతో పాటు చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా మరణిస్తూ ఉండేవి.
దీంతో వ్యాధి నయం కావడానికి ఏండ్లు పట్టేది. దీనికి పరిష్కారాన్ని కనిపెట్టిన పరిశోధకులు రోగనిరోధకశక్తికి కీలకమైన ఇంటర్ఫెరోన్-గామా సైటోకైన్లను ఉత్తేజితం చేయడం ఆరంభించారు. దీంతో క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడిచేసే ఇమ్యూనిటీ సెల్స్ను సృష్టించడంలో విజయం సాధించారు. తాజా విధానంతో క్యాన్సర్ను నయంచేసే సమయం చాలావరకూ తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.