న్యూఢిల్లీ: దేశంలో మైనారిటీలపై విద్వేషం పెరుగుతున్నదని, దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారని, తప్పు చేయకపోయినా జైళ్లలో ఉండాల్సి వస్తున్నదన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో జరిగిన పలు ఘటనలను తన లేఖలో ఉదహరించారు. కరోనా సమయంలో నిజాముద్దీన్ మర్కజ్ సంఘటనపై జరిగిన దుష్ప్రచారాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో అమాయక ముస్లింలు జైళ్లలో మగ్గారని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే మైనారిటీలపై వేధింపులు అధికంగా జరుగుతున్నాయని, వారికి వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేసే వారిపై విచారణలు, శిక్షలు ఉండటం లేదన్నారు. విద్వేషపూరిత నేరాల నియంత్రణకు అమెరికా మాదిరిగా మన దేశం లోనూ చట్టం తీసుకురావాలని దవే కోరారు. ఇటీవల జార్జియాలో హిందూఫోబియాకు వ్యతిరేకంగా చట్టం చేశారని, ఇలాంటి వాటి నుంచి మనం నేర్చుకోవాలని సూచించారు.