Nuclear Attack | న్యూఢిల్లీ, మార్చి 10: ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి సిద్ధమవగా, భారత్ దాన్ని నిలువరించినట్టు తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఈ విషయం పేర్కొంది. రష్యా ఆక్రమిత ఖేర్సన్లోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకొస్తుండడంతో రష్యా అణుమార్గాలను ఎంచుకోవడం ఖాయమని అమెరికా భావించినట్టు ఆ కథనం తెలిపింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్పై దాడికి సాకుగా చూపేందుకు డర్టీ బాంబు థియరీని రష్యా తెరపైకి తెచ్చినట్టు పేర్కొన్నది.
ఇందులో భాగంగానే ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగానికి సిద్ధమవుతున్నదని రష్యా పదేపదే ఆరోపణలు చేసినట్టు అమెరికా అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన మిత్రదేశాలను అప్రమత్తం చేసి రష్యాపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా అణ్వాయుధ ప్రయోగాన్ని నిలువరించాలని భావించింది. ఈ బాధ్యతను భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అప్పగించారు. వీరిద్దరూ చేసిన ప్రకటనలతో రష్యా తమ ప్రణాళికలను పక్కనపెట్టింది.