కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ నాశనానికి భారీ స్కెచ్ వేసింది. సీఎం సువేందు అధికారిని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే రీతబ్రత ఢిల్లీలో యాదృచ్ఛికంగా కలిశారు. (Suvendu, Ritabrata meet) ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో తిరుగుబాటు, చీలికకు దారి తీసింది. మే 4న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మే 9న ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్లో బీజేపీ తొలి ప్రభుత్వం ఏర్పాటైంది.
కాగా, మే 22న ఢిల్లీలోని బెంగాల్ భవన్లో సీఎం సువేందు అధికారిని టీఎంసీ ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీ ‘యాదృచ్ఛికంగా’ కలిశారు. ఆ సమావేశం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగింది. టీఎంసీ రాజ్యసభ సభ్యుడైన రీతబ్రత బెనర్జీ, తొలిసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ ప్రభావాన్ని ఎదుర్కొన్న ఆయన ఉలుబేరియా ఈస్ట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో వసతి గృహం ఖాళీ చేసే విధానపరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు సీఎం సువేందుతో రీతబ్రత బెనర్జీ అన్నారు. పరిపాలనా సమావేశాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నట్లు సువేందు అధికారి తెలిపారు. సమాచారం ఇస్తే తాను కూడా హాజరవుతానని రీతబ్రత చెప్పారు. తమ ఇద్దరి మధ్య అనధికారికంగా ఈ భేటీ జరిగిందని ఆయన వెల్లడించారు.
మరోవైపు సీఎం సువేందు అధికారి, టీఎంసీ ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీ మధ్య మే 22న ఢిల్లీలో జరిగిన యాధృచిక సమావేశం సాధారణమే అని అంతా భావించారు. అయితే వీరిద్దరి భేటీ తర్వాత 13 రోజుల్లోనే బెంగాల్లో రాజకీయాలు మారిపోయాయి. టీఎంసీలో అనూహ్య పరిణామాలు జరిగాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో రీతబ్రతను టీఎంసీ బహిష్కరించింది.
అయితే బీజేపీ అండతో టీఎంసీలో తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతును రీతబ్రత బెనర్జీ కూడగట్టారు. టీఎంసీలోని 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది సభ్యుల సంతకాలతో అసెంబ్లీ స్పీకర్ను కలిశారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హాదాను రీతబ్రత బెనర్జీ దక్కించుకున్నారు. ఈ పరిణామాలతో 28 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న టీఎంసీలో తొలిసారి చీలిక ఏర్పడింది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా టీఎంసీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా 15 ఏళ్ళు బెంగాల్ సీఎంగా అధికారం చెలాయించిన మమతా బెనర్జీ ప్రస్తుతం పార్టీతోపాటు గుర్తుపై హక్కు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు.