జైపూర్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా సమాజంలో అందరికీ సమాన స్వేచ్ఛ అనేది కలగానే మిగిలిపోయింది. ముఖ్యంగా దళిత సమాజంపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు, మగవాళ్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లోని చురు జిల్లాలో అలాంటి దారుణమే చోటుచేసుకుంది.
పాత గొడవలు మనసులో పెట్టుకుని ఓ 25 ఏండ్ల దళిత యువకుడిని ఎనిమిది మంది కలిసి కిడ్నాప్ చేశారు. ఓ రహస్య ప్రదేశంలో బంధించి మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టడమేగాక బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకున్నదని దర్యాప్తు అధికారి హిమాన్షు శర్మ చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎనిమిది మంది నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టామన్నారు. నిందితులు బాధితుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, మూత్రం తాగమని బలవంతపెట్టినట్లు ఇంకా రుజువు కాలేదని పేర్కొన్నారు.