ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు బీజేపీ, శివసేన పార్టీల మధ్య చిచ్చురేపాయి. రాణే వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీలకు దిగారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు.
నారాయణ్ రాణే వ్యాఖ్యలను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. దాంతో బీజేపీ కార్యకర్తలు కూడా గుంపులుగా వచ్చి వారిని అడ్డగించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు, కొట్టుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాల వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లయ్యిందో కూడా తెలియదని కేంద్రమంత్రి నారాయణ్ రాణే విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఉద్ధవ్ ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో పక్కనున్న వారిని అడిగి చెప్పారని, అప్పుడు తాను అక్కడ ఉంటే ఆయన చెంప పగులగొట్టేవాడినని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్కు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లయ్యిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటన్నారు.