Indian Railways | న్యూఢిల్లీ: దేశంలోని రైలు ప్రయాణికుల్లో 95.3 శాతం జనరల్, స్లీపర్ క్లాసుల్లోనే ప్రయాణిస్తున్నారు. కేవలం 4.7 శాతం మాత్రమే ఏసీ కోచ్ల్లో వెళుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ విడుదల చేసిన డాటా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దేశంలో 390.2 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు.
గతేడాది ఇదే కాలానికి నమోదైన 349.1 కోట్లతో పోలిస్తే 41.1 కోట్లు (11.7 శాతం) అధికం. ఈ ప్రయాణికులలో కూడా జనరల్, స్లీపర్ క్లాస్ ప్రయాణికులే ఎక్కువ. ఈ ఏడాది ఏడు నెలల్లో 390.2 కోట్ల మంది ప్రయాణం చేయగా, అందులో 372 కోట్ల మంది నాన్ ఏసీ కోచ్ల్లోనూ, కేవలం 18.2 కోట్ల మంది మాత్రమే ఏసీ కోచ్ల్లో ప్రయాణించారు.