న్యూఢిల్లీ: ఈ మధ్య కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలుసు కదా. దీంతో కేబినెట్లో మొత్తం మంత్రుల సంఖ్య 78కి చేరింది. అయితే వీళ్లలో 90 శాతం మంది కోటీశ్వరులే కాగా.. 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. అందులోనూ నలుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో మొత్తం 43 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా.. అందులో 15 మందికి కేబినెట్ హోదా, మరో 28 మందికి సహాయ మంత్రులుగా అవకాశం కల్పించారు.
24 మందిపై తీవ్రమైన కేసులు
కొత్త మంత్రివర్గాన్ని ఏడీఆర్ విశ్లేషించింది. వీళ్ల ఎన్నికల అఫిడవిట్లను ఆధారంగా చూపుతూ.. 33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించింది. వీళ్లలో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. రాజకీయ నాయకుల అఫిడవిట్లను పరిశీలిస్తూ.. ఎన్నికలకుముందు ఏడీఆర్ ఇలా రిపోర్టులను రూపొందిస్తుంది.
90 శాతం కోటీశ్వరులే
ఇక కొత్త కేబినెట్లో 70 మంది మంత్రులు కోటీశ్వరులే అని కూడా ఏడీఆర్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అంటే వీళ్ల కనీస సంపద రూ.కోటిపైనే ఉన్నట్లు అఫిడవిట్లలో చూపించారు. నలుగురు మంత్రుల ఆస్తులు రూ.50 కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లు కూడా ఏడీఆర్ తెలిపింది. వీళ్లలో జ్యోతిరాదిత్య సింధియా (రూ.379 కోట్లు) తొలిస్థానంలో ఉండగా.. పియూష్ గోయల్ (రూ.95 కోట్లు), నారాయణ్ రాణె (రూ.87 కోట్లు), రాజీవ్ చంద్రశేఖర్ (రూ.64 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రతి మంత్రి సగటు సందప రూ.16.24 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. ఇక కొత్త మంత్రివర్గంలో అతి తక్కువ ఆస్తులున్నట్లు చూపించిన వాళ్లలో త్రిపురకు చెందిన ప్రతిమా భౌమిక్ (రూ.6 లక్షలు), పశ్చిమ బెంగాల్ నుంచి జాన్ బార్లా (రూ.14 లక్షలు), రాజస్థాన్ నుంచి కైలాష్ చౌదరి (రూ.24 లక్షలు), ఒడిశా నుంచి బిశ్వేశ్వర్ తుడు (రూ.27 లక్షలు), మహారాష్ట్ర నుంచి వి. మురళీధరన్ (రూ.27లక్షలు) ఉన్నారు.