PM Modi | ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి రోజులను దేశ ప్రజలు చూస్తున్నారు. అచ్ఛే దిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నది. ప్రజాసంక్షేమం అటుంచితే.. నిత్యం వివాదాస్పద, అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని అగ్నిగుండంగా మార్చడమే కాదు.. ప్రజలకు అరిగోస చూపిస్తున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నేటికి (శుక్రవారం) 9 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ తొమ్మిదేండ్ల బీజేపీ హయాంలో జాతి జనులు ఎదుర్కొన్న దయనీయ పరిస్థితులపై గణాంకాలతో రిపోర్ట్..
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పైన పటారం.. లోన లొటారం.. బీజేపీ పాలన అంతా డంబాచారం. అధికారంలోకి వచ్చిన 9 ఏండ్లలోనే దేశాన్ని 90 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లిన ఘనత బహూశా మరేవరికీ దక్కదేమో. ఆ రికార్డును కేంద్రంలోని బీజేపీ సర్కారే సొంతం చేసుకొన్నది. హామీలిచ్చి నెలబెట్టుకోకపోవడం, ధరలను ఆకాశాన్నంటేలా చేయడం, అంతర్జాతీయ సూచీల్లో అధమ ప్రదర్శన కోసం పోటీ పడటం, నిరుద్యోగంలో ముందుండటం, అప్పులు తీసుకోవడంలో కొత్త రికార్డులు సృష్టించడం, దేశ భద్రతను గాలికొదిలేయడం, అసంబంద్ధ నిర్ణయాలతో పౌరుల ఉసురు తీయడం, ముందూ వెనుక ఆలోచించకుండా విధానాలు అమలు చేసి చతికిలపడటం, రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం.. వెరసి 9 ఏండ్ల బీజేపీపాలనలో యావత్తు దేశం సబ్ కా సత్తెనాశ్గా మారిపోయింది. 9 కీలకాంశాల్లో మోదీ ప్రభుత్వ పనితీరుని పరిశీలిస్తే..9 హామీలు అట్టర్ ఫ్లాప్
2014లో అధికార పగ్గాలు చేపట్టే ముందు మోదీ ప్రధానంగా తొమ్మిది అంశాలపై దేశ ప్రజలకు హామీనిచ్చారు. ప్రతి ఒక్కరికీ ఉండటానికి ఇళ్లు కట్టిస్తామన్నారు. కానీ నేడు ప్రతి ఇద్దరిలో ఒకరికి సొంత గూడు లేదు. ఆకలి లేని భారతాన్ని సృష్టిస్తామన్నారు. ఆకలి సూచీలో భారత్ 107వ స్థానానికి దిగజారింది. పరిశ్రమలకు ప్రోత్సాహాన్నిచ్చి విస్తరింపజేస్తామన్నారు. రోజుకు 270 చొప్పున ఇప్పటి వరకూ 8 లక్షల కంపెనీలకు తాళం పడింది.
దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతామన్నారు. ఫలితాలు చూస్తే బానిసత్వ సూచీలో ప్రపంచంలోనే భారత్ టాప్లో ఉంది. అన్ని దవాఖానల్లో బెడ్లు, అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. అంబులెన్స్ సర్వీసులు లేక మరణించిన బిడ్డను భుజాన వేసుకొని కాలినడకన వెళ్లే తల్లిదండ్రుల ఉదంతాలు నిత్యకృత్యంగా మారాయి. కరోనా సమయంలో దవాఖానల్లో బెడ్ల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశాన్ని సిరిసంపదలతో నింపి, నల్లధనాన్ని వెలికితీసి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు. తీరా ఇప్పుడు ప్రతి భారతీయుడి మీద రూ.1.2 లక్షల అప్పు మోపారు. ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిపిస్తామన్నారు. 21 కోట్ల మందికి నేటికీ అకౌంట్ లేదు. 70 శాతం ఇండ్లకు నీటి సరఫరాలేదు. ప్రతి ఇంటికి కరెంటు కనెక్షన్ ఇస్తామన్నారు. 40 శాతం ఇండ్లల్లో 8 గంటలే కరెంటు ఉంటున్నది. 9 ఏండ్లలో మోదీ పాల్గొన్న 90 ఈవెంట్స్, టూర్ల వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరికీ తెలియదు. ప్రధాని ఎప్పుడూ వార్తల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే వాటిని నిర్వహించినట్టు వాదనలు ఉన్నాయి.14 సూచీలు.. 49 అంశాల్లో అధః పాతాళం
నిరుద్యోగం, విద్య, వైద్యం ఇలా దేశాభివృద్ధికి కీలకంగా పిలిచే 14 సూచీల్లో భారత్ అత్యంత దారుణమైన స్థానాల్లో నిలిచింది. ప్రపంచ ఆకలి సూచీ (107), హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్ (146), హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ (150), వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్ (139), పర్యావరణ పరిరక్షణ సూచీ (180), ప్రపంచ లింగ సమానత్వ సూచీ (135), ఈఐయూ డెమోక్రసీ ఇండెక్స్ (53), హెన్లె పాస్పోర్ట్ ఇండెక్స్ (90), మానవాభివృద్ధి సూచీ (132), పత్రికా స్వేచ్ఛ సూచీ (142), పింఛన్ సూచీ (41), అవినీతి సూచీ (85), దయనీయ సూచీ (103), బానిసత్వ సూచీ (1) ర్యాంకుల్లో ఉండి దాదాపు అన్ని రంగాల్లో అధః పాతాళానికి చేరుకొన్నది.
ఈ ప్రధాన సూచీలే కాకుండా.. వివిధ అంతర్జాతీయ అధ్యయన సంస్థలు వెల్లడించిన మరో 53 సూచీల్లో భారత్ 49 అంశాల్లో దిగజారిపోయింది. పౌరహక్కులు, బహుళత్వానికి సంబంధించిన 6 సూచీలు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన 7 సూచీలు, చట్టబద్ధపాలన, అవినీతి, పారదర్శక రంగాలు, మత స్వాతంత్య్రానికి సంబంధించి 8 సూచీలు, సుస్థిరత, వాతావరణ పరిరక్షణకు సంబంధించి 6 సూచీలు, మహిళా భద్రత, సమానత్వానికి సంబంధించి 4 సూచీలు, ఆర్థిక స్వాతంత్య్రానికి సంబంధించి 5 సూచీలు ఇలా మొత్తం 53 సూచీల్లో 49 విషయాల్లో భారత్ చివరి స్థానాల్లో నిలిచింది.
నింగినంటిన నిరుద్యోగం
‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ అంటూ 2014 లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా అయిన మోదీ దేశ నిరుద్యోగ యువతకు హామీనిచ్చారు.
అయితే, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని బీజేపీ ప్రభుత్వం గడిచిన 9 ఏండ్లలో 8 లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. కేంద్రప్రభుత్వ విభాగాల్లో లక్షల కొద్దీ ఖాళీలు ఉన్నాయని నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ నివేదికలు పేర్కొన్నప్పటికీ, వాటిని భర్తీ చేయాలన్న సోయి కేంద్రానికి లేకుండా పోయింది. దీంతో విద్యార్హతలకు తగిన కొలువు దొరక్క 22 కోట్ల మంది యువతీ, యువకులు వీధుల్లో చెప్పులరిగేలా తిరుగుతున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం.. మార్చిలో 7.8 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నాటికి 8.11 శాతానికి ఎగబాకింది. గత డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరగడం ఇదే తొలిసారి.
ప్రమాదంలో దేశ భద్రత
సరిహద్దుల్లో భారత భూభాగంలోకి చొరబడుతూ చైనా హద్దుమీరుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు దీటుగా స్పందించట్లేదు. గల్వాన్లో 20 మంది జవాన్లు అమరులైతే, చైనా యాప్లపై నిషేధం విధించి కేంద్రం చేతులు దులుపుకున్నది.
దీంతో మరింతగా రెచ్చిపోయిన డ్రాగన్ దేశం అప్పటివరకూ బఫర్ జోన్లుగా ఉన్న గల్వాన్, పాంగాంగ్ త్సో, గోగ్రా, హాట్స్ప్రింగ్స్ వంటి వ్యూహాత్మక భారత భూభాగాలను తమవిగా ప్రకటించింది. గల్వాన్ ఘటనను తమ ఘనతగా చైనా ప్రచారం చేసుకొన్నప్పటికీ కేంద్రం నోరు మెదపలేదు. అరుణాచల్లోని ప్రాంతాల పేర్లను చైనా ఏక పక్షంగా మార్చివేస్తున్నా.. కేంద్రం మౌన ముద్రనే ఆశ్రయిస్తున్నది. దీంతో దేశ భద్రత విషయంలో బీజేపీ సర్కారు వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ను (ఈడీ) ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్న తీరిది.
ఇప్పటి వరకూ ఈడీ మొత్తం 121 కేసులు నమోదు చేయగా, వాటిలో 115 అంటే 95 శాతం విపక్ష నాయకులపైనే నమోదయ్యాయి. సీబీఐ 124 కేసులు నమోదు చేయగా, వీటిలో ప్రతిపక్ష నాయకులపైనే 118 ఉన్నాయి. నేరారోపణలు రుజువైంది మాత్రం 0.5 శాతం కంటే తక్కువ కేసుల్లోనే. పీఎంఎల్ఏ (మనీ ల్యాండరింగ్) తదితర సెక్షన్ల కింద తొమ్మిదేండ్లలో పెట్టిన కేసులు 5,422 కాగా, వీటిలో ప్రతిపక్ష నాయకులపై నమోదైనవి 5,150 ఉన్నాయంటే బీజేపీ హయాంలో దేశంలో పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పదేండ్ల యూపీఏ హయాంతో పోలిస్తే, 9 ఏండ్ల బీజేపీ హయాంలో విపక్షాలపై నమోదైన కేసులు 27 రెట్లు ఎక్కువ. మోదీ విధానాలను విమర్శించడంతో 149 మందిపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి.ధరల భారం..పెట్రో, గ్యాస్ మంట
75 ఏండ్ల స్వతంత్య్ర భారతంలో కనీవినీ ఎరుగని రీతిలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దైనందిన జీవితంలో వాడుకొనే ఆహార సరుకుల ధరలు 2014-2023 మధ్య 300 శాతం పెరిగాయి.
బియ్యం, పాలు, పప్పు, చింతపండు ఇలా దేన్ని ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులు కడుపునిండా కూడా తినడానికి భయపడే దుర్దినాలు దాపురించాయి. ముగ్గురు సభ్యులున్న ఒక కుటుంబానికి 2014లో వారానికి వెయ్యి రూపాయలు ఖర్చవ్వగా, ఇప్పుడు రూ. 1,638కి చేరింది. సామాన్యుల పొదుపు ఖాతాల్లో రూ. 18 లక్షల కోట్లు ఉండాల్సింది.. ప్రస్తుతం రూ. 5 లక్షల కోట్లకు దిగజారింది. పెట్రోల్, డీజిల్, సిలిండర్ రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. 2014లో రూ. 399 ఉన్న వంటగ్యాస్.. ఇప్పుడు రూ. 1,159కి, రూ. 71 ఉన్న లీటర్ పెట్రోల్ రూ. 109.66కి, రూ. 55 ఉన్న డీజిల్ రూ. 97కి ఎగబాకింది.
ఒక్కొక్కరి మీద రూ.1.2 లక్షల అప్పు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసం రూ.55,87,149 కోట్లు అప్పు చేస్తే, గడిచిన 9 ఏండ్లలోనే బీజేపీ సర్కారు రూ. 112,77,238 కోట్ల అప్పు చేసింది. వెరసి దేశం మొత్తం అప్పులు రూ. 168,64,387 కోట్లకు చేరుకొన్నాయి.
అంటే దేశంలో ఇప్పుడే పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకూ ఒక్కొక్కరిపై రూ. 1.2 లక్షల అప్పు ఉన్నట్టు లెక్క. మిత్తీల చెల్లింపునకే ఏటా రూ.8 లక్షల కోట్లను ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో 20 శాతం డబ్బులు మిత్తీలు కట్టడానికే వెళ్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో బ్యాంకులకు ఎగనామం పెట్టిన బడా కార్పొరేట్లకు సంబంధించిన మొండి బకాయిలను రైటాఫ్ చేయడంలో బీజేపీ సర్కారు రికార్డు సృష్టించింది. 9 ఏండ్ల బీజేపీ హయాంలో ఎగవేతదార్లు 10 రెట్లు పెరగ్గా, దాదాపు రూ. 12 లక్షల రుణాలను కేంద్రం రైటాఫ్ చేసింది.
అనాలోచిత నిర్ణయాలకు పౌరులు బలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలు, తీసుకొచ్చిన పాలసీల కారణంగా సామాన్యులు పెద్దయెత్తున మృత్యువాతపడ్డారు. పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడలేక 108 మంది మరణించారు.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అక్కడ జరిగిన ఘర్షణల్లో 169 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. సీఏఏ నిరసనల్లో 35 మంది, సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలు మత ఘర్షణలుగా మారి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. రాత్రికిరాత్రి తీసుకొన్న లాక్డౌన్ నిర్ణయంతో 989కి పైగా వలస కార్మికులు మృత్యువాతపడ్డారు. సాగుచట్టాలను నిరసిస్తూ చేపట్టిన నిరసనల్లో 702 మంది రైతన్నలు మరణించారు.తుస్సుమన్న తొమ్మిది విధానాలు
అనేక రకాల పన్నులతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే దేశం-ఒకే ట్యాక్స్ ఉంటే సులువుగా ఉంటుందని కేంద్రం రాష్ట్రాలను బలవంతంగా ఒప్పించి మరీ జీఎస్టీని తీసుకువచ్చింది. ట్యాక్స్ స్లాబులతో ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పొరుగు దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్నవారికి ఆశ్రయం కల్పిస్తామంటూ బీజేపీ సర్కారు పౌరసత్వ చట్టానికి సవరణ (సీఏఏ) చేసింది. ఎన్నార్సీ, ఎన్పీఆర్పైనా నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మడమే పనిగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కొంతకాలంగా తీవ్ర చర్చకు దారి తీసింది. గడిచిన 9 ఏండ్లలో 120 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మింది.
ప్రధాని మోదీ రాత్రికి రాత్రే దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రవాణా సదుపాయాలు లేక వేల మంది వలస కార్మికులు కాలినడక వేల కిలోమీటర్ల దూరం నడుచుకొంటూ స్వస్థలాలకు వెళ్లారు. మార్గ మధ్యలో ఆకలికి తాళలేక, ప్రమాదాల్లో వందల మంది చనిపోయారు. రైతులు వ్యతిరేకించినప్పటికీ కేంద్రం మొండిగా సాగు చట్టాల అమలుకు ప్రయత్నించింది. రైతులు ఏడాదికి పైగా ఆందోళనలు చేశారు. చివరికి ప్రధాని మోదీ రైతులకు సారీ చెప్పి సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటున్నట్టు ప్రకటించారు.
రెండేండ్ల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్ను నిలిపివేసిన కేంద్రం అగ్నిపథ్ పేరుతో మళ్లీ అగ్గి రాజేసింది. ఖర్చులను తగ్గించుకోవడం కోసమని ఆర్మీని కాం ట్రాక్టు సైన్యంతో నింపే ప్రయత్నం చేస్తున్నది. యువత జీవితాలతో ఆడుకొంటూ ఏకంగా దేశ భద్రతపైనే ప్రయోగాలు చేస్తున్నది. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా 16 రాష్ర్టాల్లో నిరసనలు మిన్నంటాయి. 2022 నాటికి రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ ప్రభుత్వం.. దాన్ని నెరవేర్చకపోగా.. పెట్టుబడివ్యయాన్ని భారీగా పెరిగేలా చేసింది.