హైదరాబాద్: మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. రెండు అంశాలపై ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీనిపై ప్రధాని మోదీ నోరెత్తడంలేదని అసదుద్దీన్ ఆరోపించారు. ఇక సరిహద్దుల్లో చైనా కూడా మన భూభాగంలోకి ప్రవేశిస్తోందని, దాని గురించి కూడా మోదీ సర్కార్ ఏమీ చేయలేకపోతున్నదని ఆయన అన్నారు. హాట్స్ప్రింగ్స్, అరుణాచల్ ప్రదేశలో చైనా సైనికులు దూసుకువస్తున్నారని, కానీ వారిని మోదీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందన్నారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేస్తామన్న మోదీ.. దాంట్లో విఫలమైనట్లు అసద్ పేర్కొన్నారు. కశ్మీర్లో తాజాగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో 9 మంది భారత జవాన్లు మరణించారని, ఒకవైపు సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మరో వైపు టీ20 వరల్డ్కప్లో ఇండియా ఎలా పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతుందని అసద్ ప్రశ్నించారు. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 24వ తేదీ ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. చైనాను ఎదుర్కోవడంలో.. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో మోదీ విఫలమైనట్లు అసద్ ఆరోపించారు.