ముంబై, మే 19: కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ ఇవ్వాలని రిజర్వ్బ్యాంక్ నిర్ణయించింది. 2022-23 సంవత్సరానికి రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించాలన్న ప్రతిపాదనను శుక్రవారం గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలో ముంబైలో జరిగిన రిజర్వ్బ్యాంక్ సెంట్రల్ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోదించింది. గత 2021-22 ఖాతా సంవత్సరంలో చెల్లించిన రూ.30,307 కోట్లకంటే ప్రస్తుత డివిడెండ్ దాదాపు మూడింతలైంది. కంటింజెన్సీ రిస్క్ బఫర్గా 6 శాతం అట్టిపెట్టుకోవాలని బోర్డు నిర్ణయించింది. నిరుడు బఫర్ 5.5 శాతంకాగా, దానిని ఈ ఏడాది స్వల్పంగా పెంచుకుంది. వాణిజ్య బ్యాంక్లకు ఇచ్చే రుణాలపై వడీతో పాటు బాండ్ల కొనుగోలు, అమ్మకాల ద్వారా, విదేశీ మారకం క్రయవిక్రయాల ద్వారా ఆర్బీఐ ఆర్జించే లాభంలో మెజారిటీ భాగాన్ని తన యజమాని అయిన కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. దీనినే డివిడెండ్గా వ్యవహరిస్తారు. కొంత మొత్తాన్ని మార్కెట్ అవసరాలకు రిస్క్ బఫర్గా అట్టిపెట్టుకుంటుంది. అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిస్థితుల్ని, ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిణామాలతో ఎదురవుతున్న సవాళ్లను తాజాగా ఆర్బీఐ బోర్డ్ సమీక్షించింది. వార్షిక నివేదికను, ఖాతాలను ఆమోదించింది.
బడ్జెట్ అంచనాలకంటే ఎక్కువే…
ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన అంచనాలకంటే అధిక మొత్తాన్ని ఆర్బీఐ డివిడెండ్గా చెల్లిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంక్ల నుంచి రూ.48,000 కోట్లు వస్తాయని అంచనావేయగా, ఒక్క రిజర్వ్బ్యాంకే రూ.87 వేల కోట్లకుపైగా ఖాజానాకు సమకూరుస్తున్నది. అయితే నిరుడు బడ్జెట్లో రూ. 73,948 కోట్ల నిధుల్ని ఆర్బీఐ, బ్యాంక్ల నుంచి ఆశించగా, అంతకంటే తక్కువగా రూ.40,953 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.