Screen Time | గతంలో బడులకు ఎండాకాలం సెలవులు ఎప్పుడు వస్తాయా అంటూ పిల్లలు, వారితోపాటు తల్లిదండ్రులు ఎదురుచూపులు చూసేవారు. పిల్లలు తమకు ఇంటి పని.. వ్యవసాయం పనిలో సాయ పడతారని తల్లిదండ్రులు ఆశించే వారు. పనుల్లో తల్లిదండ్రులతో సాయం చేస్తూ.. తర్వాత వారితోనే కలిసి ఆడుకునేవారు చిన్నారులు.. ఇలా ఎండాకాలం సెలవులు ముగిసిపోతున్నాయనే విషయమే తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఎండాకాలం సెలవులు ప్రారంభమైతే తమ పిల్లలు ఎక్కడ మొబైల్ ఫోన్లతోనే టైం అంతా గడుపుతారోనని 85 శాతం మంది తల్లిదండ్రులు బెంగ పడుతున్నారని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ కోసం కాంటార్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
కొన్ని దశాబ్దాల క్రితం హాలీడేస్ అంటేనే బడికి విరామం.. అమ్మమ్మ, నానమ్మల ఇండ్లకు విహార యాత్ర.. తాతయ్యలతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసే వారు పిల్లలు.. కానీ ఇప్పుడలా కాదు.. కొంచెం టైం దొరికితే చాలు మొబైల్ స్క్రీన్లకే అతుక్కు పోతున్నారు. మొబైల్ ఫోన్లతోనే కాలం గడుపుతుండటం వల్ల పిల్లల్లో చురుకుదనం తగ్గుతున్నదని 90 శాతం మంది పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారని కాంటార్ సర్వేలో బయట పడింది.
తమ పిల్లలకు రెండు గంటల్లోపే మొబైల్ ఫోన్లతో గడుపాలని మెజారిటీ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కానీ 69 శాతం మంది చిన్నారులు ప్రతి రోజూ మూడు గంటలకు పైగా స్క్రీన్తో గడపటానికి మొగ్గుతున్నారని చెబుతున్నారు. 96 శాతం మంది పేరెంట్స్.. తమ పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోకుండా నివారించడానికి ఏం చేయాలన్న అంశంపై ఆన్లైన్లో వెతుక్కుంటున్నారని ఈ సర్వే పేర్కొంది. దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల పరిధిలో మూడేండ్ల నుంచి ఎనిమిదేండ్ల మధ్య వయస్సు గల పిల్లల తల్లిదండ్రులు 750 మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
సాధారణంగా సెలవుల్లో పిల్లలు కొత్త అంశాలు తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. పిల్లల వ్యవహార సరళికి పేరెంట్స్ నియమం పెట్టాలని కాంటార్ ఎగ్జిక్యూటివ్ ఎండీ దీపిందర్ రాణా చెప్పారు. బయటకు వెళ్లి ఆటలాడుకోవడాన్ని ప్రోత్సహించాలని సూచించారు. వాయిద్యంపై ఆసక్తి.. వినోదం నింపే పాటలు, డ్యాన్స్లు నేర్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని హితవు చెప్పారు. మొబైల్ స్క్రీన్తో ఎంత సేపు ఆడుకోవాలో ముందే షరతు పెడితే సరిపోతుందన్నారు.