Unemployment | న్యూఢిల్లీ, మార్చి 27: దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. నిరుద్యోగుల్లో దాదాపు 83 శాతం మంది యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజా నివేదిక పేర్కొన్నది. ఐఎల్వో, ఇన్స్టిట్యూట్ ఆప్ హ్యూమన్ డెవలప్మెంట్(ఐహెచ్డీ) సంయుక్తంగా ‘భారత ఉపాధి నివేదిక-2024’ను ప్రచురించాయి. మొత్తం నిరుద్యోగ యువతలో కనీసం సెకండరీ విద్య చదువుకొన్న వారి సంఖ్య పెరుగుతుండటంపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
2000లో 35.2 శాతం ఉన్న వీరి సంఖ్య 2022 నాటికి రెట్టింపై 65.7 శాతానికి చేరుకొన్నదని వెల్లడించింది. కరోనా సంక్షోభం సమయంలో ఉపాధి భారీగా పడిపోయిందని, ఈ కాలంలో చదువుకొన్న యువత అధిక నిరుద్యోగితను ఎదుర్కొన్నారని అధ్యయనం పేర్కొన్నది. 2000-2018 మధ్య శ్రామిక భాగస్వామ్య రేట్(ఎల్ఎఫ్పీఆర్), శ్రామిక జనాభా నిష్పత్తి(డబ్ల్యూపీఆర్) క్రమంగా తగ్గాయని, 2019 తర్వాత కొంత మెరుగైందని నివేదిక తెలిపింది.
వివిధ రాష్ర్టాల మధ్య తేడాలు
మరోవైపు రెగ్యులర్ కార్మికుల వేతనాలు, స్వయం ఉపాధి పొందే వారి ఆదాయం విషయంలో 2019 తర్వాత కొంత స్తబ్ధత నెలకొనడంతోపాటు క్షీణించాయని నివేదిక తెలిపింది. 2022లో అయితే నైపుణ్యం లేని సాధారణ కార్మికుల్లోని చాలా మంది కనీస వేతనాలను కూడా అందుకోలేకపోయారని పేర్కొన్నది.
ఉపాధి విషయంలో దేశంలోని వివిధ రాష్ర్టాల మధ్య తేడాలు చాలా భారీగా ఉన్నాయి. కొన్ని రాష్ర్టాలు ఉపాధి సూచీల్లో తక్కువ ర్యాంకుల్లో నిలిచాయి. బీహార్, యూపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ర్టాలు ఏండ్లు పేలవమైన ఉపాధి తీరుతెన్నులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. స్థానికంగా ప్రభుత్వ విధానాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అధ్యయనం ఎత్తిచూపింది.
ఉపాధి అవకాశాలపై టెక్నాలజీ ప్రభావం
యువత అధికంగా ఉండే భారత్.. వారికి ఉపాధి కల్పన విషయంలో మాత్రం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నదని నివేదిక పేర్కొన్నది. కొవిడ్-19 సంక్షోభం యువత లేబర్ మార్కెట్లో సవాళ్లను పెంచిందని తెలిపింది. పెరిగిన సాంకేతికత కూడా ఉపాధిపై ప్రభావం చూపుతున్నదని, నైపుణ్యాల డిమాండ్ను పెంచిందని పేర్కొన్నది. యువతలో చాలా మందిలో ప్రాథమిక డిజిటల్ అక్షరాస్యత లేదని, ఇది నేటి కాలంలో వారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదని నివేదిక స్పష్టం చేసింది. భారత యువతలో 90 శాతం మంది స్ప్రెడ్షీట్లో మ్యాథ్మాటికల్ ఫార్ములా చేయలేకపోతున్నారని, 60 శాతం మందికి ఫైళ్లను కాపీ, పేస్టు చేయడం రాదని, 75 శాతం మందికి అయితే అటాచ్మెంట్లతో కూడిన మెయిళ్లను పంపడం తెలియదని పేర్కొన్నది.
ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించలేదు!
కాగా, భారత ఉపాధి నివేదిక-2024 విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం వంటి అన్ని సామాజిక, ఆర్థిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని అనుకోవడం సరికాదని అన్నారు. ఉపాధి విషయంలో ప్రభుత్వం ఏమి చేయగలదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రపంచంలో వాణిజ్య రంగం నియామకాలు చేపడుతుందని అన్నారు. ప్రభుత్వం ఇటీవల స్కిల్ ఇండియా మిషన్లు వంటి కార్యక్రమాలను చేపట్టిందని చెప్పుకొచ్చారు. అయితే అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యలపై మరో ఆర్థికవేత్త సంతోష్ మెహ్రొత్రా స్పందించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, దాని సంబంధిత ఆర్థికవేత్తలు సమస్యను గుర్తించి, దానికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయకుండా, భారత జాబ్ మార్కెట్పై అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.