న్యూఢిల్లీ: కరోనా (Corona) మహమ్మారి దేశంలో మరణాల సంఖ్యను అధికం చేస్తుండగా, జననాల రేటును తగ్గిస్తు వస్తున్నది. 2019లో 76.4 లక్ష మంది మృతిచెందగా, 2020 నాటికి ఆ సంఖ్య 81.2 లక్షలకు చేరింది. ఇది అంతకుముందు ఏడాదికంటే 6.2 శాతం అధికమని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) తెలిపింది. 2020లో మరణాలు పెరగడానికి కరోనాయే కారణమని ఆర్జీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ ఏడాది 1.48 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. 2021లో మరోనాతో 3.32 లక్షల మంది చనిపోయారని పేర్కొన్నది. కాగా, దేశంలో ఇప్పటివరకు 5,23,920 మంది బాధితులు వైరస్తో కన్నుమూశారు.
2020లో మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, హర్యానాల్లో మరణాలు అత్యధికంగా నమోదయ్యాయని వెల్లడించింది.
ఇక జననాల విషయానికి వస్తే.. 2019 కంటే 2020లో జన్మించినవారి సంఖ్య 2.4 శాతం తగ్గింది. 2019లో 2.48 కోట్ల మంది జన్మించగా, 2020లో 2.42 కోట్ల మంది చిన్నారులు పురుడు పోసుకున్నారని ఆర్జీఐ తెలిపింది. బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, జమ్ముకశ్మీర్, లడఖ్లో తప్ప మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన జననాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నది.
ఉత్తరప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 2019 నాటికంటే 2020లో నమోదైన జననాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించింది.