లక్నో : కొడుకు, కోడలు తన బాగోగులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన 80 ఏండ్ల వృద్ధుడు రూ. కోటిన్నర విలువైన తన ఆస్తులను రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్కు చెందేలా బదిలీ చేసిన ఘటన యూపీలోని ముజఫర్నగర్లో వెలుగుచూసింది. తన కొడుకు, కోడలు తనను పట్టించుకోనందున వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తిని వారికి ఇవ్వదలుచుకోలేదని ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్ బిరాల్ గ్రామానికి చెందిన రైతు నాథూ సింగ్ తెలిపారు.
తన ఆస్తిని యూపీ గవర్నర్కు చెందేలా పత్రాలను సిద్ధం చేశారు. తాను మరణించిన అనంతరం తన స్ధలంలో స్కూల్ లేదా ఆస్పత్రి కట్టించాలని నాథూ సింగ్ కోరుతున్నారు. తనను కొడుకు, కోడలు చూడకపోవడంతో వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నానని సింగ్ చెప్పుకొచ్చారు.
గవర్నర్కు తన ఆస్తిని అప్పగిస్తే దాన్ని వారు సద్వినియోగం చేస్తారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. తన అంత్యక్రియలకు కుటుంబసభ్యులు హాజరు కావాలని తాను కోరుకోవడం లేదని ఆయన తేల్చిచెప్పారు. నాథూ సింగ్ కోరిక మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామని బుధాన తహసిల్ సబ్ రిజిస్ట్రార్ పంకజ్ జైన్ తెలిపారు.
Read More :