లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు, లారీ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వాహనాల నుంచి వెలికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో దౌరెహ్రా నుంచి లక్నోకు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఎలా బ్రిడ్జికి సమీపంలో ఇసానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇదిలావుంటే లఖింపూర్ ఖేరి జిల్లా ఆస్పత్రికి తరలించిన వారిలో కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం లక్నో ఆస్పత్రికి రిఫర్ చేశారు. కాగా ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.