న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో అరెస్ట్ అయిన 8 మంది భారత నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. వారి శిక్షను ఖతార్ ప్రభుత్వం రద్దు చేసి విడుదల చేసింది. వీరిలో ఏడుగురు సోమవారం ఉదయం భారత్ చేరుకున్నారు. గూఢచర్యం కేసులో మూడున్నర నెలల క్రితం ఖతార్ కోర్టు వీరికి తొలుత మరణ శిక్ష విధించింది. అయితే భారత ప్రభుత్వ దౌత్య ప్రయత్నాలు ఫలించి వారు విడుదలయ్యారు. మొదట విదేశాంగ మంత్రి జైశంకర్ పలుమార్లు ఖతార్ అధికారులతో చర్చలు జరిపారు. మరోవైపు తెర వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పలుమార్లు దోహా వెళ్లి మాజీ నేవీ అధికారుల విడుదల విషయమై ఖతార్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ కేసు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత చొరవ తీసుకున్నట్టు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. 13, 14 తేదీల్లో యూఏఈలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 14న ఖతర్ రాజధాని దోహా చేరుకుని ఎమిర్ ఆఫ్ ఖతార్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వెల్లడించారు. భారత మాజీ నేవీ అధికారుల విడుదల వేళ ప్రధాని ఖతార్లో పర్యటించనుండటం గమనార్హం.
కృతజ్ఞతలు తెలిపిన భారత్
భారత అధికారులను విడుదల చేస్తూ ఖతార్ తీసుకున్న నిర్ణయానికి భారత విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. దాహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ గూఢచర్యం ఆరోపణలపై శిక్ష అనుభవిస్తున్న వారిలో మాజీ కెప్టెన్లు నవ్తేజ్ గిల్, సౌరభ్ వశిష్ట్, కమాండర్లు పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్పాల్, ఎస్కే గుప్తా, బీకే వర్మా, సుగుణాకర్ పాకాల, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. పెండింగ్ పేపర్ వర్క్ కారణంగా తివారీ ఒక్కరే ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. గూఢచర్యం ఆరోపణలపై గత ఏడాది అక్టోబరు 26న ఖతార్ కోర్టు వీరికి మరణ దండన విధించగా భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఖతార్పై ఒత్తిడి తేవడంతో అక్కడికి కోర్టు అప్పీలుకు అవకాశం ఇచ్చింది. విచారణ అనంతరం డిసెంబర్ 28న మరణ శిక్షను జైలుశిక్షగా మారుస్తూ మూడేండ్ల నుంచి 25 ఏండ్ల వరకు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత కూడా భారత ప్రభుత్వం వారిని విడిపించడానికి పట్టు వదలకుండా ప్రయత్నించడంతో వీరికి ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది.