ముంబై: ముంబైలో డిజిటల్ అరెస్టు(Digital Arrest) స్కామ్ జరిగింది. సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ 74 ఏళ్ల మహిళ సుమారు 4.62 కోట్లు కోల్పోయింది. బాంబే ఐఐటీలో మెడికల్ ఆఫీసర్గా చేసి ఆమె రిటైరైంది. మనీల్యాండరింగ్ కేసులో ఉన్నావని, సీబీఐ అరెస్టు చేస్తుందని ఆమెను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు వృద్ధ మహిళను మోసం చేసిన కేసులో నరేంద్ర సిన్హా, గుంజన్ దేవ్కుమార్ దినేశ్చంద్రను ముంబై వెస్ట్రన్ రీజియన్ సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు ఆ మహిళ బ్యాంక్ అకౌంట్లను అందజేసినట్లు ఆ ఇద్దరిపై ఆరోపణలు ఉన్నాయి.
బాధిత వృద్ధ మహిళకు తొలుత ఓ వ్యక్తి నుంచి వీడియో కాల్ వచ్చింది. టెలికాశం శాఖ అధికారి అని ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. మరో వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ అని బెదిరించాడు. ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 6 కోట్లు కాజేశారని ఆ మహిళను బెదిరించారు. ఇది మనీల్యాండరింగ్ కేసు కిందకు వస్తుందని హెచ్చరించారు. సీబీఐ కేసు నమోదు చేసిందని, త్వరలో అరెస్టు చేస్తారని ఆ వృద్ధురాలిని బెదిరించారు.
సైబర్ క్రిమినల్స్ వత్తిళ్లకు భయపడ్డ ఆ మహిళ తన ఎఫ్డీ, రికరింగ్ డిపాజిట్లను విత్డ్రా చేసుకున్నది. సుమారు 4.62 కోట్ల ఎఫ్డీలను ఆమె తన ఖాతా నుంచి 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి మధ్య విత్డ్రా చేసుకున్నది. ఆ డబ్బును సైబర్ క్రిమినల్స్కు ట్రాన్స్ఫర్ చేసింది. చీటింగ్ జరిగినట్లు గుర్తించిన ఆ మహిళ తుదకు పోలీసుల్ని ఆశ్రయించింది. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. డబ్బు ట్రాన్స్ఫర్ కోసం సిన్హా, దినేశ్చంద్రలు పలు అకౌంట్లు ఓపెన్ చేశారు. ఆ డబ్బును సైబర్ క్రిమినల్స్కు ఇచ్చి కమీషన్ తీసుకున్నారు.