జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Elections) రికార్డు స్థాయిలో పోలింగ్ (Polling) నమోదయింది. తుది గణాంకాల ప్రకారం 73.92 శాతం ఓటింగ్ నమోదయింది. సాయంత్రం 6 గంటల వరకు 72 శాతం నమోదవగా తుది గణాంకాల ప్రకారం మరో 1.9 శాతం పెరిగింది. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పోల్చితే ఈ సారి కాస్త తగ్గింది. అప్పట్లో 74.13 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగాను 199 చోట్ల శనివారం పోలింగ్ జరిగింది. 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 5.25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే మరోసారి భారీగా ఓటింగ్ నమోదవడంతో ఫలితం ఎవరివైపు ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.