Road Accident | న్యూఢిల్లీ : ఢిల్లీ – జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా జమ్మూలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్కు చెందిన 30 మంది వైష్ణో దేవి టెంపుల్కు మినీ బస్సులో బయల్దేరారు. వీరంతా ఒకే కుటుంబ సభ్యులు. అయితే వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు అంబాలా వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కు ముందు ఓ కారు వేగంగా వెళ్తూ.. పెట్రోల్ బంక్ వద్ద ఆకస్మాత్తుగా మలుపు తిప్పాడు. దీంతో దాని వెనుకాలే వేగంగా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. ట్రక్కు వెనుకాలే వెళ్తున్న మినీ బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేక ట్రక్కును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.