Rajasthan Elections | జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు చిన్న పార్టీలు 68 స్థానాల్లో తలనొప్పిగా మారాయి. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, భారతీయ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ వంటి 78 పార్టీలు గట్టి పోటీనిస్తున్నాయి. మరోవైపు 38 మంది రెబల్స్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ అభ్యర్థులు గెలవకపోయినా, తమ విజయావకాశాలను దెబ్బ తీస్తారని ఈ పెద్ద పార్టీలు తలపట్టుకుంటున్నాయి. 1993 నుంచి పరిశీలించినపుడు ఈ చిన్న పార్టీలు, స్వతంత్రులు దాదాపు 20 శాతం ఓట్లను సాధిస్తున్నారు.
ఆర్ఎల్పీ: ఆర్ఎల్పీ చీఫ్, నాగౌర్ ఎంపీ హనుమాన్ బేణీవాల్ ఈ ఎన్నికల్లో తనతోపాటు 81 స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. ఖిన్స్వర్, మెర్టా, భోపాల్గఢ్, పర్బత్సర్, మసుదా, బేటూ, అసింద్, చోము, కోలాయట్-సివానా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఈ పార్టీ పోటీనిస్తున్నది. 2018 ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలిచారు.
బీఏపీ: భారతీయ ఆదివాసీ పార్టీ గత ఎన్నికల్లో రెండు శాసన సభ స్థానాల్లో గెలిచింది. దుంగార్పూర్, బన్స్వారా జిల్లాల్లో బీటీపీ ఓటింగ్ సరళిని ప్రభావితం చేయగలదని విశ్లేషకులు చెప్తున్నారు. చోరాసీ, సగ్వారా, ఆస్పూర్, ఘటోల్, ధరియావాడ్, ప్రతాప్గఢ్, ఉదయ్పూర్ (గ్రామీణ), సలుంబర్, ఖేద్వారాలలో తాము బలంగా ఉన్నామని బీఏపీ చెప్తున్నది.
బీఎస్పీ: బీఎస్పీ ఈసారి 185 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. 2018 ఎన్నికల్లో 190 స్థానాల నుంచి పోటీ చేసి, ఆరు నియోజకవర్గాల్లో గెలిచి, 4.03 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్, బీజేపీ తర్వాత మూడో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ప్రస్తుతం తూర్పు రాజస్థాన్, ఎస్సీ ప్రాబల్యంగల నియోజకవర్గాల్లో తమకు గట్టి పట్టు ఉందని బీఎస్పీ వర్గాలు చెప్తున్నాయి.
సీపీఎం : సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నది. కనీసం నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా నిలుస్తున్నది. 2018 ఎన్నికల్లో సీపీఎంకు రెండు స్థానాలు లభించాయి. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ 20 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మూడింటిలో బలంగా కనిపిస్తున్నది. బీజేపీ రెబల్ అభ్యర్థి రఘుబీర్ సింగ్ తన్వర్ను ఆకర్షించి, ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నది.
స్వతంత్రులు: స్వతంత్ర అభ్యర్థులు 38 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఇబ్బందికరంగా మారారు.