న్యూఢిల్లీ, అక్టోబర్ 3: కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో(సీఏపీఎఫ్) సంక్షోభం నెలకొన్నది. పలు కారణాలతో వందలాది మంది సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వేలాది మంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు. 2018 నుంచి 2022 వరకు మధ్య ఐదేండ్ల వ్యవధిలో 654 మంది సీఏపీఎఫ్ సిబ్బంది ఆత్యహత్య చేసుకొన్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
అంటే గత ఐదేండ్లుగా మూడు రోజులకు ఒకరు చొప్పున బలవన్మరణానికి పాల్పడున్నట్టు లెక్క. మరోవైపు ఇదే ఐదేండ్ల కాలంలో 50,155 మంది సీఏపీఎఫ్ సిబ్బంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆత్మహత్యలకు వ్యక్తిగత, కుటుంబ కారణాలు, మానసిక సమస్యలు కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రమాదకరమైన ఏరియాల్లో విధులు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు, విశ్రాంతి లేని డ్యూటీలు, కుటుంబం నుంచి దూరంగా ఉండటం, సెలవులు సరిపోకపోవడం, పదోన్నతులకు పరిమిత అవకాశాలు వంటి కారణాలతో అధికారులు రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
పార్లమెంటరీ కమిటీ ఆందోళన
పెరుగుతున్న సాయుధ బలగాల సిబ్బంది ఆత్మహత్యలపై హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది సీఏపీఎఫ్ సిబ్బంది క్లిష్టమైన పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఈ ఏడాది మార్చిలో రాజ్యసభకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సిబ్బందిని బలగాల్లోనే కొనసాగేలా, వారిలో మనోైస్థెర్యం నింపేలా వారి పని పరిస్థితులను మెరుగుపరిచేందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించింది.