శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 62 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మూడు నెలల్లో 32 మంది మరణించారని జమ్ముకశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఉగ్రవాదులంతా హతమయ్యాయరని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. 62 మంది ఉగ్రవాదుల్లో 39 మంది లష్కరే తోయిబాకు, 15 మంది జైషే మహ్మద్కు, 6 మంది హిజ్బుల్ ముజాహిదీన్కు, ఇద్దరు అల్-బదర్కు చెందినవారని చెప్పారు. హతమైన 62 మంది ఉగ్రవాదుల్లో 47 మంది స్థానికులు కాగా 15 మంది విదేశీ ఉగ్రవాదులని వివరించారు.
కాగా, మానవ మేధస్సు, సాంకేతిక, కేంద్రీకృత కార్యకలాపాల వల్ల జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుతోందని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 62 మంది ఉగ్రవాదులు హతం కాగా ఇందులో 32 మందిని భద్రతా దళాలు గత మూడు నెలల్లోనే మట్టుబెట్టాయని అన్నారు.
మరోవైపు పుల్వామాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కార్మికులు, స్థానికేతరులు, స్థానిక పౌరులపై దాడులు చేసినవారని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. మరణించిన ఉగ్రవాదులను ఐజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్గా గుర్తించినట్లు చెప్పారు. వీరిద్దరూ స్థానికులని, అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని తెలిపారు.