కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తొలి విడుత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆరు గంటల తర్వాత కూడా అప్పటికే క్యూ లైన్లలో ఉన్నవారికి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.
అసోంలో మూడు విడుతల్లో, పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఇవాళ తొలి విడుత పోలింగ్ జరుగుతుండగా, ఏప్రిల్ 1 రెండో విడుత పోలింగ్ జరుగనుంది. ఇదిలావుంటే పోలింగ్ సమయం మరో రెండు గంటలు మిగిలి ఉండగానే రెండు రాష్ట్రాల్లో భారీగా పోలింగ్ నమోదు కావడంతో.. సమయం ముగిసేసరికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి విడుతలో పశ్చిమబెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.