బెంగళూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ తర్వాత ఆరుగురు మహిళలు మరణించారు. (Women Die Post Delivery) సిజేరియన్ సర్జరీ తర్వాత వీరంతా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆరోగ్య మంత్రి దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై ప్రజలు నిరసన తెలుపాలని అన్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో డెలివరీ కోసం 25 ఏళ్ల సుమయ నవంబర్ 10న అడ్మిట్ అయ్యింది. నవంబర్ 12న ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు.
కాగా, సుమయకు సర్జరీ తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. అయితే ఆమెకు కిడ్నీ సమస్యలతో పాటు బహుళ అవయవ వైఫల్యానికి దారితీసింది. డయాలసిస్ చేయించుకుంటున్న సుమయ డిసెంబర్ 5న మరణించింది. ఆమెకు ముందు రోజమ్మ, నందిని, ముస్కాన్, మహాలక్ష్మి, లలితమ్మ కూడా డెలివరీ అనంతర సమస్యల వల్ల మరణించారు. దీంతో ఈ సంఘటనలపై ఆ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు ఈ ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలను ప్రజలు సహించరాదని, నిరసనలు తప్పవని అన్నారు. బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం ప్రకటించిందని తెలిపారు. ఇకపై ఎలాంటి మరణాలు సంభవించకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
కాగా, నిర్లక్ష్యం వహించిన వారితోపాటు బాధ్యులపై చర్యలు చేపడతామని ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. వీరి మరణాలకు ఐవీ ఫ్లూయిడ్స్ కారణమని ల్యాబ్ పరీక్షలో తేలిందన్నారు. దీంతో వాటిని సరఫరా చేసిన బెంగాల్ ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.