శ్రీనగర్, జమ్ము, నవంబర్ 17: జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో గురువారం రాత్రి నుంచి జరిగిన 18 గంటల ఎదురుకాల్పుల్లో ఐదుగురు, రాజౌరి జిల్లాలో ఒక ఉగ్రవాది మరణించినట్టు కశ్మీర్ జోన్ ఐజీపీ వీకే బిర్డీ తెలిపారు. కుల్గాం ఘటనలో మృతదేహాలను డ్రోన్ల ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గురువారం కుల్గాంలోని నెహామా గ్రామంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి.